అన్న క్యాంటీన్లను ఎత్తివేయొద్దని అసెంబ్లీ సాక్షిగా చెప్పినా జగన్ వినలేదు: అచ్చెన్నాయుడు

  • జగన్ హయాంలో రాష్ట్రానికి ఒక్క పరిశ్రమ కూడా రాలేదన్న అచ్చెన్న
  • చేసిన అభివృద్ధిని చెప్పుకోకపోవడం వల్లే 2019లో టీడీపీకి నష్టం జరిగిందని వ్యాఖ్య
  • వైసీపీ మరోసారి అధికారంలోకి రాకుండా పాతిపెడదామన్న అచ్చెన్న
వైసీపీ అధినేత జగన్ పై ఏపీ మంత్రి అచ్చెన్నాయుడు విమర్శలు గుప్పించారు. మహానాడులో ఆయన మాట్లాడుతూ... జగన్ హయాంలో రాష్ట్రానికి ఒక్క పరిశ్రమ కూడా రాలేదని అన్నారు. ఏ రాష్ట్రానికైనా పరిశ్రమల ద్వారానే ఆదాయం, ఉద్యోగాలు వస్తాయని చెప్పారు. 24 నెలల కూటమి పాలనలో రాష్ట్రానికి రూ. 24 లక్షల కోట్ల పెట్టుబడులు సాధించామని తెలిపారు. 

పేదలకు రూ. 5కే కడుపు నింపే అన్న క్యాంటీన్లను ఎత్తివేయొద్దని అసెంబ్లీ సాక్షిగా చెప్పినా.. ఆనాడు జగన్ వినిపించుకోలేదని అచ్చెన్న విమర్శించారు. అన్న క్యాంటీన్లను తొలగించారని దుయ్యబట్టారు. అమరావతి, పోలవరం ప్రాజెక్టు నిర్మాణాలు శరవేగంగా సాగుతున్నాయని తెలిపారు. ప్రాంతాల మధ్య, ప్రజల మధ్య చిచ్చు పెట్టేందుకే జగన్ మూడు రాజధానులు అన్నారని విమర్శించారు. మూడు ప్రాంతాల్లోనూ ఎన్నికల్లో జగన్ కు ఎదురుదెబ్బ తగిలిందని ఎద్దేవా చేశారు. 

2014-19 మధ్య కాలంలో టీడీపీ హయాంలో ఏపీలో ఎంతో అభివృద్ధి జరిగిందని... కానీ దాన్ని మనం చెప్పుకోలేదని అచ్చెన్న అన్నారు. అదే సమయంలో జగన్ చెప్పిన అబద్ధాలను ప్రజలు నమ్మడంతో 2019లో టీడీపీకి నష్టం జరిగిందని చెప్పారు. ఈసారి ప్రజలకు అలాంటి ఛాన్స్ ఇవ్వొద్దని... మన ప్రభుత్వం చేసిన మంచి పనులను, అభివృద్ధిని ప్రజలకు వివరించి వారిని చైతన్యపరచాలని అన్నారు. రాష్ట్రంలో మరోసారి వైసీపీ అధికారంలోకి రాకుండా పాతిపెడదామని చెప్పారు.

Atchannaidu
Jagan
YS Jagan
Anna Canteens
Andhra Pradesh
AP Assembly
TDP
Amaravati
Polavaram Project
AP Development

More Telugu News